
తెలంగాణలోని కరీంనగర్ మెట్పల్లి పట్టణంలో పసుపు రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపునకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో మీడియా తో మాట్లాడుతూ జేఏసీ నాయకులు పసుపు రైతులకి కనీస మద్దతు ధర 15 వేల రూపాయలుగా పెంచాలని డిమాండ్ చేశారు. సాధారణంగా ప్రతి ఏడాది ఇదే సీజన్ లో రూ.18 వేలు ధర ఉండేదని, కానీ ప్రస్తుతం రూ.8 వేలు కూడా దాటడం లేదన్నారు.
దీని వల్ల రైతులకి విపరీతం గా నష్టాలూ వస్తున్నాయని వాపోయారు. ఇప్పుడు పలికే ధరకి రైతు పడే కష్టానికి సంభంధం లేదని విమర్శించారు. గోరుచుట్టు మీద రోకలి పోటు లాగ, వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం పసుపు రైతులకి శాపంగా మారింది. ఈ జీఎస్టీల వల్ల రూ.8 వేలకు వచ్చే డ్రిప్ యూనిట్ ధర అందాలానికి అంటిందని, ఇప్పుడు అదే డ్రిప్ యూనిట్ కోసం రూ.35 వేలు ఖర్చు చెయ్యాలిసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పేద పసుపు రైతులకి నిరాశని మిగిలించింది.
వీటికి తోడు, వ్యాపారులు కూడా రాబందుల లాగ, అవకాశం దొరికిన వెంటనే పసుపు రైతులని దోచుకుంటున్నారు. పంట డబ్బులు ఇచ్చేందుకు కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరు తో 2 శాతం క్యాష్ కటింగ్ చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఢిల్లీ, సాంగ్లి, కి చెందిన స్థానిక వ్యాపారులు సిండికేట్ గా మారారు అని, వారికీ తోచినట్టు ఇష్టా రాజ్యంగ ధర తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పసుపు రైతులకి కనీస మద్దతు ధర రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమం ఆగేదెలేదంటూ హెచ్చరించారు. మార్కెట్ ఆఫీస్ నుంచి మొదలు పెట్టి రైతులు భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు.
సుమారు రెండు గంటలు పాటు నడిచిన ఈ ధర్నా కారణంగా ట్రాఫిక్ కు భారీ అంతరాయం ఏర్పడింది. పైగా హైవేపై రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇది దైనందిన పనులు చేసుకునే సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బందులకు గురిచేసింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో శ్రీనివాస్ కు అందజేశారు.
Share your comments